డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్

  • డీఎంకేను ప్రజలు తిరస్కరించారన్న కాంగ్రెస్ ఎంపీ
  • పరోక్షంగా తమకు ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్య
  • తాము 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం
టీవీకే అధినేత విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో డీఎంకేలోని కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని వారు విమర్శలు గుప్పించారు. డీఎంకే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాకూర్ స్పందించారు. అసలు డీఎంకే కారణంగానే తమ పార్టీ నష్టపోయిందని ఎదురుదాడి చేశారు.

తమిళ ప్రజలు డీఎంకే పార్టీని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఈ నష్టం తమ పార్టీకే ఎక్కువగా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎంకే పార్టీతో పొత్తు కారణంగా తాము 17 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వాన్ని కోరుకున్నారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని అన్నారు.

గవర్నర్ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌ని ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. తమిళ ప్రజలు మార్పుకు ఓటు వేశారని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ప్రజలు కొత్త నాయకుడికి పట్టం కట్టినట్లు తెలిపారు. టీవీకే పార్టీ నుంచి 108 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారని అన్నారు. తమ పార్టీ మద్దతుతో విజయ్‌కి 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని గుర్తు చేశారు. గవర్నర్ బీజేపీ మనిషి అని, ఈ ఢిల్లీ మైండ్ సెట్ గవర్నర్‌కు విజయ్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని విమర్శించారు. బీజేపీ అధిష్ఠానం నుంచి గవర్నర్‌పై ఒత్తిడి ఉందని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటును కావాలని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి రాష్ట్రం నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నారని, ఆ ఒక్క ఎమ్మెల్యేతో రాష్ట్రంలో రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది దురదృష్టకరమని అన్నారు.

Manickam Tagore
DMK
Congress
TVK Vijay
Tamil Nadu Politics
Assembly Elections
Government Formation

More Telugu News